పరిశోధనలు చేయాలన్నా..అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో అధ్యాపక వృత్తిలో ప్రవేశించాలన్నా.. అందుబాటులో ఉన్న మార్గం.. యూజీసీ–నెట్!!
జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్షలో ప్రతిభ చూపితే.. పరిశోధనలకు అర్హత సాధించడమే కాకుండా.. అసిస్టెంట్ ప్రొఫెసర్గానూ నియామకం పొందొచ్చు!! యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఏటా రెండుసార్లు నెట్ పరీక్షను నిర్వహిస్తుంది. యూజీసీ–నెట్ 2024 డిసెంబర్ సెషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. యూజీసీ–నెట్తో ప్రయోజనాలు, దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష విధానం తదితర వివరాలు..
పరిశోధనలు అనగానే సైన్స్, టెక్నాలజీ విభాగాల వారికే అవకాశాలు ఉంటాయని అందరూ భావిస్తారు. ఇందుకోసం నిర్వహించే సీఎస్ఐఆర్–యూజీసీ నెట్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ.. సైన్స్, టెక్నాలజీతోపాటు ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ విభాగాల్లో సైతం పరిశోధనలకు మార్గం చూపుతుంది యూజీసీ నెట్. దీంతోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్గానూ అవకాశాలు అందుకోవచ్చు.
ఏటా రెండుసార్లు
యూజీసీ–నెట్ (నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్)ను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. తాజాగా 2024, డిసెంబర్ సెషన్కు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. యూజీసీ–నెట్ 2024 డిసెంబర్ సెషన్లో కొత్తగా రెండు పేపర్లను చేర్చారు. ఇప్పటి వరకు 83 సబ్జెక్ట్లలో పరీక్షను నిర్వహించగా.. తాజా నోటిఫికేషన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆయుర్వేద బయాలజీ సబ్జెక్ట్లను చేర్చారు. దీంతో మొత్తం సబ్జెక్ట్ల సంఖ్య 85కు చేరింది.
అర్హతలు
కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత ఉండాలి. పీహెచ్డీలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే వారు కనీసం 75 శాతం మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులవ్వాలి. చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు అయిదు శాతం చొప్పున ఉత్తీర్ణత శాతంలో మినహాయింపు లభిస్తుంది.
మూడు కేటగిరీలుగా పరీక్ష
యూజీసీ నెట్ పరీక్షను మూడు కేటగిరీలుగా నిర్వహిస్తారు. అవి..
కేటగిరీ–1: జేఆర్ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్), అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ.
కేటగిరీ–2: అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పీహెచ్డీలో ప్రవేశం కేటగిరీ.
కేటగిరీ–3: కేవలం పీహెచ్డీలో ప్రవేశం కేటగిరీ.
ప్రాథమ్యాలు ఇలా
రీసెర్చ్/జేఆర్ఎఫ్ పట్ల ఆసక్తి ఉన్న వారు.. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రాథమ్యాన్ని ఎంపిక చేసుకోవాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం, పీహెచ్డీ ప్రవేశం.. రెండూ కోరుకునే వారు రెండో కేటగిరీకి దరఖాస్తు చేసుకోవాలి.
కేవలం పీహెచ్డీ ప్రవేశం కోసం మూడో కేటగిరీని ఎంచుకోవాలి.
నెట్ స్కోర్, ఇంటర్వ్యూలకు వెయిటేజి
నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో పీహెచ్డీలో ప్రవేశం కల్పించే క్రమంలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తారు. ఎంపిక ప్రక్రియలో నెట్ స్కోర్కు 70 శాతం, తదుపరి దశలో యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్స్ నిర్వహించే ఇంటర్వ్యూలో స్కోర్కు 30 శాతం వెయిటేజీ ఉంటుంది.
ఏడాది గుర్తింపు
ఆయా యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్స్లో పీహెచ్డీ ప్రవేశం కోసం.. కేటగిరీ–2, కేటగిరీ–3లలో పరీక్షకు హాజరైన వారి నెట్ స్కోర్కు.. ఫలితాలు వెల్లడించిన తేదీ నుంచి ఏడాదిపాటు గుర్తింపు ఉంటుంది. ఆ సమయంలో ఎప్పుడైనా.. ఏ ఇన్స్టిట్యూట్కైనా పీహెచ్డీలో ప్రవేశానికి సదరు స్కోర్తో దరఖాస్తు చేసుకోవచ్చు.
300 మార్కులకు పరీక్ష
నెట్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు.
పేపర్–1: టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్. ఈ విభాగంలో 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్–1 మూడు కేటగిరీల అభ్యర్థులకు ఉమ్మడిగా నిర్వహిస్తారు.
పేపర్–2: ఇది సబ్జెక్ట్ పేపర్. ఇందులో అభ్యర్థుల డొమైన్ సబ్జెక్ట్ నుంచి 100 ప్రశ్నలతో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇలా రెండు పేపర్లు కలిపి మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.
కనీస మార్కుల నిబంధన
యూజీసీ నెట్ కనీస అర్హత మార్కుల నిబంధనను అమలు చేస్తోంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రెండు పేపర్లలో కలిపి కనీసం 40 శాతం మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 35 శాతం మార్కులు సాధించాలి. ఈ సడలింపు (35 శాతం మార్కులు) జనరల్– ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా ఉంటుందని పేర్కొన్నారు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, డిసెంబర్ 10
ఆన్లైన్ దరఖాస్తు సవరణ: 2024, డిసెంబర్ 12, 13 తేదీల్లో
నెట్ తేదీలు: 2025, జనవరి 1 నుంచి 19 వరకు
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ugcnet.nta.ac.in