కూటమి ప్రభుత్వం ఎమ్మిగనూరు పట్టణంలోని ఆదోని-మంత్రాలయం బైపాస్ రోడ్డు సమీపంలో దాదాపు 77 ఎకరాలలో టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్నూలు జిల్లా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం కర్నూలులో జిల్లా ఓర్వకల్లు ప్రాంతంలో ఇండస్ట్రియల్ హబ్లో జయరాజ్ స్టీల్ ఫ్యాక్టరీ సంస్థ ఏర్పాటు అవుతోంది. ఈ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 5000 మందికి, పరోక్షంగా 10,000 మందికి పైగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఈ స్టీల్ ఫ్యాక్టరీ పనులు దాదాపు 80 శాతం మేర పూర్తి కావడంతో మరి కొద్ది రోజుల్లోనే ఇది పూర్తిగా అందుబాటులోకి రానుంది.
మరోవైపు పూర్వకల్లు ప్రాంతంలో ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్రోన్ హబ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫున 300 ఎకరాలను కేటాయించి డ్రోన్ తయారీ శిక్షణ హబ్ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులు ఇప్పటికే స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను అందించారు. మరోవైపు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో నేత కార్మికులు అధికంగా ఉండడంతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే గత వైయస్సార్సీపి ప్రభుత్వ హయాంలో దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అక్కడ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కాలేదు.